సర్కారీ స్కూళ్ళు దారుణం
హైదరాబాద్, మేజర్న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడం కోసం అనేక రకాలైన విద్యా పథకాల పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ ఫలితాలలో మార్పులు ఉండడం లేదు. గత ఆరేళ్ళలో నుంచి 2004 విద్యా సంవత్సరం నుంచి లెక్కించినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది.2004-2005 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 66.93 శాతంగా ఉన్న ఎన్రోల్మెంట్, 2009-2010 విద్యా సంవత్సరంలో 56.82 శాతానికి పడి పోయింది. ఈ విషయాలు రాజీవ్ విద్యా మిషన్ (ఎస్ఎస్ఎ) చేసిన బడిబాట కార్యక్రమం, ఇతర కార్యక్రమాల ద్వారా స్పష్టమైందని స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అలీ రఫత్ పేర్కొన్నారు.నిర్వీర్యమవుతున్న విద్యా పథకాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ఉమ్మడి భాగస్వామ్యంతో సర్కారి స్కూళ్ళను అన్ని విధాలుగా అభివృద్ధి పరచడం కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అయినప్పటికీ ఫలితాలు ఏ మాత్రం పెరగడం లేదు. ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం సర్వ శిక్ష అభియాన్, అనే పథకం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ పథకం లక్ష్యం పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంతో బాటు సర్కారి స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ పెంచే కార్యక్రమాలు కూడా చేయాలి. అందుకోసం బోధన పద్దతులపై ఎప్పటికప్పుడు టీచర్లకు శిక్షణలు ఇవ్వడం, క్లిప్, క్లాప్ కార్యక్రమాలు చేయడం, కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పిల్లలను ఆకర్షించలేక పోతున్నారు.
అందులో భాగంగానే కొన్ని సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. దాని వల్ల ఇంటి దగ్గర భోజనం లేని వారికి స్కూల్కు వచ్చినట్లయితే ఆ భోజనం స్కూళ్ళలోనే తినే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించాయి. అందుకోసం ఏడాదికి దాదాపు రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికి ఎన్రోల్మెంట్ ఏ మాత్రం పెరగడం లేదు. ముఖ్యంగా బాలికల ఎన్రోల్మెంట్ భారీగా తగ్గింది. డ్రాప్ అవుట్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి పోయింది.
పట్టణాలకు వలసలు, ఇంగ్లీష్ స్కూళ్ళు లేక పోవడం
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ సంఖ్య భారీగా తగ్గపోవడానికి రెండు రకాల కారణాలను గుర్తించారు. అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కరువై పట్టణాలకు తరలి పోతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వలసలపై వెళ్ళిన వారంతా ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పొందుతున్నారు. అలాగే ప్రభుత్వ అధీనంలో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు లేవు. ఈ రోజులో కూలి పని చేసుకునే కుంటుంబం కూడా తమ పిల్లవానికి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్న ఆలోచనలు పెరిగాయి.
దానికనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు లేక పోవడం వల్ల వారంతా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.ఇత్యాది కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం అంతకంతకు పడి పోతున్నదని స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే వారి వివరాలు కూడా గత ఆరేళ్లలో ఈ ఏడాదిలో చాలా తక్కువ సంఖ్య నమోదైంది. గత ఏడాదిలో కొటీ 36 లక్షల మంది విద్యార్థులు ఎన్రోల్ కాగా, 2009-2010 విద్యా సంవత్సరంలో మాత్రం కోటీ 33 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఎన్రోల్ అయ్యారు. రోజు రోజుకు జనాభా సంఖ్య పెరిగుతున్నప్పటికీ కూడా చదువుకునే వారి సంఖ్య తగ్గి పోవడం గమనించాల్సిన విషయంగా మారింది.
సూర్య తెలుగు పేపర్
No comments:
Post a Comment